Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చర్చకు సిద్ధమా?.. వర్ల రామయ్యకు ఎమ్యెల్యే సుధాకర్‌బాబు సవాల్‌

చర్చకు సిద్ధమా?.. వర్ల రామయ్యకు ఎమ్యెల్యే సుధాకర్‌బాబు సవాల్‌
, శనివారం, 26 అక్టోబరు 2019 (18:28 IST)
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షకు అప్పటి ప్రభుత్వం రూ.10 కోట్లు ఖర్చు చేసిందని, కానీ టీడీపీ నాయకులు మాత్రం కేవలం కోటి మాత్రమే ఖర్చయ్యాయని చెబుతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు పేర్కొన్నారు.

ఈ విషయంపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన సవాల్‌ స్వీకరిస్తున్నామని ఆయన ప్రకటించారు. అయితే ఇందు కోసం వర్ల రామయ్య సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని, తాను స్వయంగా ఆయన ఇంటికి వెళ్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. మరి చర్చకు వర్ల రామయ్య సిద్ధంగా ఉన్నారా? అని ప్రతి సవాల్‌ చేశారు.

ఢిల్లీ ధర్మ పోరాట దీక్షకు టీడీపీ ప్రభుత్వం నాడు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు రుజువు చేస్తామని, అప్పుడు చంద్రబాబుతో పాటు, వర్ల రామయ్య రాజకీయాల నుంచి వైదొలగుతారా? అని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు నిలదీశారు. ఒకవేళ తాను ఆ విషయాన్ని రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ధర్మపోరాట దీక్షల పేరుతో టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసిందని, దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసిందని, దీనిపై విచారణ జరపాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుతున్నామని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు చెప్పారు.

అన్యాయంగా అక్రమంగా దొంగ సవాల్‌
టీడీపీ నేత వర్ల రామయ్య చాలా అన్యాయంగా, అక్రమంగా ఒక దొంగ సవాల్‌ విసిరారని, ఆ సవాల్‌ను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వీకరిస్తోందని శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు వెల్లడించారు.

చంద్రబాబు నాయకత్వంలో ఢిల్లీలో ఫిబ్రవరి 11, 2019న ధర్మ పోరాట దీక్ష జరిగిందని, దాని కోసం రూ.10 కోట్లు కేటాయిస్తూ జీఓ నెం.215 జారీ చేశారని, ఆ జీఓను గతంలో కూడా చూపామని, ఇప్పుడు మళ్లీ మీడియా ముందు ఉంచుతున్నామని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తెలిపారు.

అయితే ఆ దీక్షకు కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని, దాన్ని నిరూపిస్తామని, సచివాలయానికి వస్తామని మంత్రి శ్రీ పేర్ని నాని మీద వర్ల రామయ్య అవాకులు చెవాకులు పేలారని గుర్తు చేశారు. 

దమ్ము, ఖలేజా ఉందా?
‘మీకు దమ్ముంటే, ఖలేజా ఉంటే, వర్ల రామయ్య.. నీవు సచివాలయానికి రా. ఈ ఒక్కటి చాలు.. మీరు గత 5 ఏళ్లుగా చేస్తున్న అసత్య ప్రచారాలకు, చాలా విషయాలను మభ్య పెడుతున్నారని చెప్పడానికి రుజువు.

టీడీపీ హయాంలో ప్రజాదనం దారుణంగా దుర్వినియోగమైంది. ఢిల్లీ ధర్మ పోరాట దీక్షకు రూ.10 కోట్లు కేటాయిస్తూ, జీఓ జారీ చేసి, కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని చెబుతున్నారు’ అని వైయస్సార్‌సీపీ నేత పేర్కొన్నారు. 

నేనే మీ ఇంటికి వస్తాను
‘మీరు సచివాలయానికి వస్తే ఇంకా సమస్యలు వస్తాయి కాబట్టి, ఈ జీఓ పట్టుకుని నేను స్వయంగా నీ ఇంటికి వస్తాను. మరి చర్చకు సిద్ధంగా ఉన్నారా?. ఢిల్లీ పోరాట దీక్షకు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు మేము రుజువు చేస్తాము.

అలా చేస్తే నీవు, చంద్రబాబు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? ఒకవేళ మేము నిరూపించలేకపోతే నేను రాజీనామా చేస్తాను’ అని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రకటించారు. 

ప్రజాధనం దుర్వినియోగం
ధర్మ పోరాట దీక్షల కోసం ప్రతి జిల్లాకు తొలుత కోటి రూపాయల చొప్పున మంజూరు చేశారని, ఆ తర్వాత ఒక్కో జిల్లాలో రూ.3 కోట్లు ఖర్చు చేశారని, ఆ విధంగా మొత్తం 13 జిల్లాలకు రూ.39 కోట్లు, ఢిల్లీలో దీక్ష కోసం మరో రూ.10 కోట్లు మొత్తం రూ.49 కోట్లు ఖర్చు చేశారని సుధాకర్‌బాబు వెల్లడించారు.

ఎవరి కోసం?
‘మరి వాటి వల్ల కనీసం హోదా అయినా సాధించారా? దీక్షలన్నీ పసుపు, పసుపు చొక్కాల మయం. ఇది ప్రజల కోసం చేసిన పనా? రాష్ట్రం కోసం చేసిన పనా? మేము ఇదే విషయాన్ని ఆరోజు ప్రశ్నిస్తే, మేము అభివృద్ధికి అడ్డు అని, మా నేత శ్రీ వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేశారు.
 
మీరు ఎక్కడ దీక్ష చేసినా చుట్టూ ఏసీలు, పరుపులు వినియోగించారు. మీ ప్రచారం కోసం అలా రూ.50 కోట్లు ఖర్చు చేశారు’. ‘అందుకే వర్ల రామయ్య.. నేను స్వయంగా మీ ఇంటికి వస్తాను. సవాల్‌ స్వీకరించాము. మరి సిద్ధంగా ఉండు’ అని సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు.

న్యాయమూర్తులూ తప్పుబట్టారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్షల కోసం చేసిన ఖర్చుపై ఒక సామాన్యుడు పిల్‌ వేస్తే, హైకోర్టు న్యాయమూర్తులు కూడా స్పందించారని, వారు నాటి ప్రభుత్వాన్ని తప్పుబట్టారని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. అసలు ఏ చట్టం కింద నిధులు విడుదల చేశారని హైకోర్టు ప్రశ్నించిందని, ఆ వివరాలు ఆరా తీసిందని చెప్పారు. 

నోరు అదుపులో పెట్టుకో
వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, నిజానికి చంద్రబాబు ఆయనకు ఏమీ ఇవ్వకపోయినా, పూర్తిగా పక్కన పెట్టినా పదే పదే మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఏ చర్చకైనా రెడీ ‘వర్ల రామయ్యా ఇకనైనా నోరు మూసుకో. మనం ఏది మాట్లాడినా నిజమే మాట్లాడుదాము. మేము ఏ అంశంలో అయినా ప్రత్యక్ష చర్చకు రెడీ.
 
హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు మీరు సమాధానం చెప్పండి. హైకోర్టుకు సమాధానం చెప్పండి’ అని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.
 
విచారణ జరపాలని కోరుతున్నాం
చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం చేసిన దీక్షల కోసం ఖర్చు చేసిన దాదాపు రూ.50 కోట్లపై విచారణ జరిపించాలని సామాన్య ప్రజల తరపున సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను కోరుతున్నామని సుధాకర్‌బాబు చెప్పారు.

అన్నీ కపట రాజకీయాలే
మాట్లాడితే 40 ఏళ్ల రాజకీయం అనే చంద్రబాబువి అన్నీ కపట నాటకాలని, అది ఆయన నైజం అని ఎమ్మెల్యే ఆరోపించారు. ‘రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన కాంగ్రెస్‌తో జత కట్టావు. కానీ ఏం సాధించావు? రాజధాని కోసం 40 వేల ఎకరాలు తీసుకున్నావు. ఆ రైతుల ఉసురు నీకు తగిలింది.

రాజధానిలో కనీసం ఒక్కటైనా శాశ్వత నిర్మాణం ఉందా? ఏమైనా అభివృద్ధి చేశారా? కనీసం ఒక్క రోడ్డు అయినా నేరుగా అమరావతిలోకి రావడానికి నిర్మించారా? ఎందుకు ఇప్పటికీ కరకట్టపైనే ఆధారపడాల్సి వస్తోంది’ అని సుధాకర్‌బాబు గుర్తు చేశారు.

శాశ్వత నిర్మాణం జరిగే వరకు హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉండాలని బిల్లులో ఉన్నా, హడావిడిగా ఇక్కడికి తరలించారని, కానీ ఇవాళ అక్కడ ఏ మాత్రం కనీస సౌకర్యాలు లేవని, చివరకు టాయిలెట్లు కూడా లేవని, మంచినీళ్లు, టీ కూడా దొరకడం లేదని చెప్పారు. 

నిస్సిగ్గుగా లేఖ
ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణకు లేఖ రాశారని అన్నారు. శ్రీ వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టి కేవలం 5 నెలలే అయిందని, అప్పటి నుంచే వర్షాలు కురుస్తున్నాయని గుర్తు చేశారు.

 ‘లేఖ రాసిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను రమ్మనండి. హైకోర్టుకు వెళ్లి చూద్దాం. కనీసం అక్కడ టాయిలెట్లు అయినా ఉన్నాయా? లేవా? చూద్దాం’ అని వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు గట్టిగా సవాల్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్యావరణహిత సంబరాలశైలి...అసలైన దీపావళి: మంత్రి మేకపాటి