Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనది రాచరిక వ్యవస్థ కాదు.. సీఎం జగన్మోహన్ రెడ్డిగారూ : వైకాపా ఎంపీ

మనది రాచరిక వ్యవస్థ కాదు.. సీఎం జగన్మోహన్ రెడ్డిగారూ : వైకాపా ఎంపీ
, శుక్రవారం, 24 జులై 2020 (14:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మనది రాచరిక వ్యవస్థ కాదు సీఎం జగన్మోహన్ రెడ్డిగారూ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారంలోగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం మరోమారు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఎస్ఈసీగా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని కోరారు. కోర్టు తీర్పు మేరకు రమేశ్ ను నియమిస్తే తప్పేముందని ప్రశ్నించారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైనదని... అందువల్లే కరోనా వైరస్ మహమ్మారి నుంచి నాలుగున్నర కోట్ల మంది ఏపీ ప్రజలను కాపాడారాని గుర్తుచేశారు. 
 
కోర్టులకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రఘురాజు గుర్తుచేశారు. ముఖ్యంగా, మనది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య దేశమని... న్యాయ వ్యవస్థలను, కోర్టులను గౌరవిద్దామని విజ్ఞప్తి చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని అన్నారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం... రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రజాస్వామ్యబద్ధంగా భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వం మనదని అన్నారు. పక్కనున్న వారి మాటలు విని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవద్దని సూచించారు. రాజ్యాంగం మీద అవగాహన లేని కొంతమంది చేసే ఫిర్యాదులతో తనకు ఏమీ కాదన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతును నొక్కే ప్రయత్నం చేయవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సీజేఐ కీలక వ్యాఖ్యలు