Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ - గుంటూరు జిల్లా కలెక్టర్‌కు కూడా...

ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ - గుంటూరు జిల్లా కలెక్టర్‌కు కూడా...
, మంగళవారం, 21 జులై 2020 (22:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించిన ఈ వైరస్ కారణంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వైరస్ బారినపడుతున్న వారిలో రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా, అధికార వైకాపాకు చెందిన అనేక మంది నేతలు ఉన్నారు. తాజాగా వైకాపా ఎంపీ, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా ఈ వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.
 
దీనిపై విజయసాయి ట్విట్టర్‌లో స్పందించారు. "కరోనా పరిస్థితుల దృష్ట్యా, నాకు నేనుగా వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లో ఉండటం తప్పదు. టెలిఫోన్‌లోనూ అందుబాటులో ఉండను.. ఏవైనా కొన్ని అత్యవసర విషయాలకు మాత్రమే సంప్రదించగలరు" అంటూ ట్వీట్ చేశారు.
 
మరోవైపు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితలు స్పందించారు. రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప తమ మధ్య ఎలాంటి గట్టు తగాదాలు లేవని వ్యాఖ్యానించారు. 
 
విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకుని ట్విట్టర్‌లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.
 
అలాగే, అనిత స్పందిస్తూ, రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకి అందరం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను విజయసాయిరెడ్డి గారూ అంటూ అనిత ట్వీట్ చేశారు. 
 
అటు, టీడీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విజయసాయి రెడ్డి అంశంలో వ్యంగ్యం ప్రదర్శించింది. "క్వారంటైన్‌కు వెళుతున్నా అని చెప్పుకోవడం ఎందుకు, నాకు కరోనా పాజిటివ్ అని చెప్పుకోవచ్చుగా.. వై దిస్ కొలవెరి..?" అంటూ సెటైర్ వేసింది. త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించింది.
 
ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజు దాదాపు 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వేలు దాటిపోయింది. ఇప్పటివరకు 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు ఏకంగా జిల్లా కలెక్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. అంతేకాదు, కలెక్టర్ ఛాంబర్‌ను కూడా తాత్కాలికంగా మూసేశారు. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా వైద్య అధికారి, పలువురు జిల్లా అధికారులకు కూడా ఇప్పటికే పాజిటివ్ రావడంతో వారంతా క్వారంటైన్‌లో ఉంటున్న విషయం తెల్సిందే.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్: ఎమ్మెల్యే సీతక్క