Publish Date: Thu, 07 Jul 2022 (14:47 IST)
Updated Date: Thu, 07 Jul 2022 (14:50 IST)
వైకాపా ప్లీనరీ సమావేశాలు త్వరలో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్. జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలంతా కలిసి ఎన్నుకోనున్నారు. ఇందుకోసం వైకాపా పార్టీ నియమావళిని సవరించేలా ఒక తీర్మానం చేయనున్నారు. అలాగే, పార్టీ శాశ్వత గౌరవాధ్యక్షురాలిగా జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కొనసాగేలా తీర్మానం చేయనున్నారు.
అయితే, జగన్, విజయమ్మ, షర్మిల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆస్తి పంపకాల్లో తలెత్తిన మనస్పర్థల కారణంగా విజయమ్మ తన కుమార్తె షర్మిలవైపు మొగ్గు చూపారు. దీంతో గత కొంతకాలంగా ఆమె జగన్తో పాటు వైకాపాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా ప్లీనరీ సమావేశాలకు వస్తారా? లేదా? అన్నది తెలియాల్సివుంది.
మరోవైపు, త్వరలో జరిగే ప్లీనరీ తర్వాత ఇక 2027లో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు మరో సీనియర్ నేత విజయసాయిరెడ్డి కూడా చెబుతున్నారు. అంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్లీనరీ సమావేశాలు నిర్వహించేలా పార్టీ నియమావళిని సవరించనున్నారు.