Publish Date: Thu, 28 May 2020 (17:12 IST)
Updated Date: Thu, 28 May 2020 (17:13 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆస్తులు వెలకట్టలేనివి. ప్రతిరోజు కోట్లాదిరూపాయల ఆదాయం స్వామివారికి లభిస్తోంది. అయితే ఇప్పటివరకు స్వామివారికి ఎంత ఆస్తులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. టిటిడి ఉన్నతాధికారులకు తప్ప, అలాగే టిటిడిలో పనిచేసే ఉన్నతస్థానంలో వారికి తప్ప స్వామివారి ఆస్తులు అస్సలెవరికీ తెలియదు.
కానీ ఈమధ్య కాలంలో శ్రీవారికి భక్తులు ఎంతో భక్తిభావంతో సమర్పించిన స్థలాలను విక్రయించడానికి పాలకమండలి ప్రయత్నించింది. ఇది కాస్త పెద్ద దుమారమే రేపింది. స్వామివారి ఆస్తులను అమ్మే హక్కు మీకెవరు ఇచ్చారంటూ హిందూ ధార్మిక సంఘాలు మండిపడ్డాయి.
పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా శ్రీవారి ఆస్తులను భక్తులకు తెలిసే విధంగా వెబ్ సైట్లో ఉంచాలని టిటిడి పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి, పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని కోరారు. స్వామివారి ఆస్తులను ఆన్ లైన్లో పెట్టడం ద్వారా ప్రతి భక్తుడికి తెలుస్తుందన్నారు.
ఎవరూ తీసుకోని ఈ నిర్ణయం వల్ల శ్రీవారి భక్తులు సంతోషపడే అవకాశం ఉంది కాబట్టి కార్యరూపం దాల్చితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై కూడా పాలకమండలిలో చర్చించారు. త్వరలోనే ఆన్ లైన్లో స్వామివారి ఆస్తులకు సంబంధించిన వివరాలను పెట్టేందుకు టిటిడి సిద్ధమవుతోంది.