Publish Date: Sun, 08 Mar 2020 (14:17 IST)
Updated Date: Sun, 08 Mar 2020 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. బీసీలకు అన్యాయం చేసేందుకే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లలేదని మండిపడ్డారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, ఆ పార్టీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని యనమల అన్నారు. బలహీన వర్గాల ఆశలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ నీళ్లు చల్లారని ఆయన ఆరోపించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను దారుణంగా వంచించారని యనమల విమర్శించారు. బీసీ మహిళలను కూడా రాజకీయాధికారం నుంచి దూరం చేశారని ఆయన మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసేందుకే రిజర్వేషన్లపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లలేదని చెప్పారు.
కాగా, స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని సవాలు చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.