Publish Date: Sun, 12 Apr 2020 (06:05 IST)
Updated Date: Sun, 12 Apr 2020 (06:08 IST)
తమపై పెట్టిన కేసులను ఎత్తివేయకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యే సహా ఏడుగురిపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.
దీంతో.. తన పైనే కేసు నమోదు చేస్తారా అంటూ దాదాపు 3 గంటల పాటు పోలీస్టేషన్ ముందు ప్రసన్నకుమార్ రెడ్డి బైఠాయించారు. తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. తాను పిలిస్తే వచ్చిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా రాజకీయాల నుంచి తప్పుకొంటానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీపై ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు చేశారు. చివరకు కలెక్టర్ ఫోన్ చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన నిరసన విరమించారు. నిన్న బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యాక్రమానికి వందల మంది హాజరయ్యారు.
ఎవ్వరూ భౌతిక దూరం పాటించకుండా వరుసలో నిల్చున్నారనే కారణంతో ఎమ్మెల్యే సహా ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపైనే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహించారు.