Publish Date: Wed, 17 Feb 2021 (07:45 IST)
Updated Date: Wed, 17 Feb 2021 (07:46 IST)
నిన్నటి వరకూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రతిపక్షాల దృష్టిలో హీరో. జగన్ను ఢీకొని, ఆయన అభీష్ఠానికి వ్యతిరేకంగా నిలిచి మరీ, తాను అనుకున్న స్థానిక సంస్థలు జరిపించిన కథానాయకుడు. మరి ఇప్పుడు..?
మున్సిపల్ ఎన్నికలను మళ్లీ మొదటినుంచి జరిపించకుండా, రీ షెడ్యూల్ చేసిన అదే నిమ్మగడ్డ జీరో! సర్కారు ఒత్తిళ్లకు లొంగారంటూ సోషల్మీడియాలో కథనాలు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడంలో విఫలమయ్యారంటూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి కాంగ్రెస్ పార్టీ వరకూ వెల్లువెత్తుతున్న విమర్శలు.
పంచాయితీ ఎన్నికల తర్వాత, మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి.
తొలుత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వేసిన నామినేషన్లు, ఏకగ్రీవాలను రద్దు చేసి, తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించకపోవడాన్ని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి.
దీనివల్ల ఎన్నికలు నిర్వహించి ఏమి ప్రయోజనమని వాదిస్తున్నాయి. నిమ్మగడ్డలో హటాత్తుగా వచ్చిన ఈ నిర్ణయంపై విపక్షాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.