Publish Date: Fri, 15 Nov 2019 (08:38 IST)
Updated Date: Fri, 15 Nov 2019 (08:40 IST)
బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు స్వంత పార్టీ సీనియర్ నేత విష్ణు కుమార్ రాజు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేయనున్న ఆంగ్ల మాధ్యామానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఒక వైపు కన్నా వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ విమర్శలు చేస్తుంటే, మరో నేత జగన్ ను సమర్ధిస్తూ బహిరంగ ప్రకటన చేయడం సంచలనం కలిగిస్తున్నది. విశాఖలో విష్ణుకుమార్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.
దేశ, విదేశీ స్థాయికి వెళ్లాలంటే ఇంగ్లీషు భాష అవసరమన్నారు. ఇంగ్లీషు మీడియం ద్వారా మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నారని, తమ పార్టీ అధ్యక్షులు కన్నా ఎందుకు అన్నారో తనకు తెలియదని చెప్పారు. ఉప రాష్ట్రపతి ఇంగ్లీషు మీడియాన్ని వ్యతిరేకించడంపై తాను మాట్లాడనన్నారు.
సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం తాను 6 సార్లు ప్రయత్నించినా దొరకలేదన్నారు. కాగా టిడిపి నేత, మాజీ మంత్రి గంటాపై కూడా విమర్శలు గుప్పించారు.
ఆయన పార్టీ మారకపోతే ఆశ్చర్యపోవాలని వ్యాఖ్యానించారు. పదవులు లేకపోతే గంటా ఉండలేరని ధ్వజమెత్తారు. ఆయన తమ పార్టీలోకి వస్తే తాను అడ్డుపడబోమనని ముక్తాయింపు ఇచ్చారు.