Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దళిత సంఘాలకు బహిరంగ లేఖ రాసిన వర్లరామయ్య

దళిత సంఘాలకు బహిరంగ లేఖ రాసిన వర్లరామయ్య
, గురువారం, 10 జూన్ 2021 (20:41 IST)
జగన్‌రెడ్డి ప్రభుత్వ దళిత ద్రోహంపై 23 ప్రశ్నలతో దళిత సంఘాలకు టీడీపీ నేత వర్లరామయ్య బహిరంగ లేఖ రాశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులకు పారిశ్రామిక రాయితీలు కోత కోసినప్పుడు.. ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిర్వీర్యం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు?.. అంబేడ్కర్ విదేశీ విద్యను నీరుగారిస్తే అదేమని ప్రశ్నించలేదని వర్లరామయ్య నిలదీశారు.
 
అసత్యపు మాటలు-అసాధ్యపు వాగ్దానాలు చేసి దళిత అట్టడుగు ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను, దళితులపై సాగిస్తున్న దమనకాండను మౌనంగా భరిస్తూ, అదేమని ప్రశ్నిస్తున్న దళిత నాయకులను విమర్శించడం ఎంత వరకు సబబో ఆలోచించండని రాష్ట్రంలోని దళిత నాయకులకు బహిరంగ లేఖ వ్రాస్తూ ఉన్నా...
1. దళితులకు పారిశ్రామిక రాయితీలు కోత కోసినప్పుడు ఎందుకు ప్రశ్నించ లేదు?
2. ఎస్సీ సబ్ ప్లాన్ నిర్వీర్యం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు.
3. దళితులకు, గిరిజనులకు భూ కొనుగోలు పథకాన్ని నీరుగారిస్తే ఎందుకు మాట్లాడం లేదు?
4. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్ మెంట్ భూములను రెండేళ్లలో వేలాది ఎకరాలు ఈ ప్రభుత్వం గుంజుకుంటే ఎందుకు నోరెత్త లేదు?
5. అంబేడ్కర్ విదేశీ విద్యను నీరుగారిస్తే అదేమని ప్రశ్నించలేదేం?
6. దళితులు అత్యధికంగా ఉన్న అమరావతి రాజధానిని ప్రభుత్వం నీరుగారుస్తుంటే ఎందుకు మౌనం వహించారు?
7. దళితుల స్వతంత్ర ఎదుగుదలకు, సాధికారతకు ఉపయోగపడే పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడం దళిత ద్రోహం కాదా? ఎందుకు మాట్లాడరు?
8. మతాన్ని రాజకీయాల్లోకి చొప్పించి అమాయకులను ఆకట్టుకుంటుంటే మీరు నోరెత్తరేం?
9. ప్రజారాజధాని అమరావతికి భూములిచ్చిన దళిత రైతులపై అక్రమ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బేడీలు వేసి జైల్లో పెట్టిన ఈ ప్రభుత్వంపై పల్లెత్తు మాటైనా మాట్లాడలేదేం?
10. ఫ్రంట్ లైన్ వర్కర్ అయిన దళిత యువతి లక్ష్మీ అపర్ణను విశాఖ నడిరోడ్డులో పోలీసులు పడదోసి రెక్కలు విరిచి ఘోరంగా అవమానిస్తే మీరు అదేమని ప్రశ్నించరేం?
11. జడ్జి రామకృష్ణ పై అక్రమ రాజద్రోహం కేసు పెట్టి 50 రోజులుగా జైళ్లో పెట్టి బంధించి ఆ కుటుంబాన్ని వైసీపీ ముఖ్య నేతలు వెంటాడుతుంటే మీరు మౌనం వహించటం న్యాయమా?
12. డా. సుధాకర్ ను విశాఖ నడిరోడ్డులో బట్టలూడదీసి, దారుణంగా హింసించి, పిచ్చివాడిగా చిత్రించి, అతని మరణానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని పల్లెత్తుమాటనరేం?
13. ఇసుక మాఫియాను ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు పోలీసు స్టేషన్ లో శిరోముండనం చేస్తే పల్లెత్తు మాటనరేం?
14. పల్నాడులో దళితులపై దాడి చేసి తరిమి, తరిమి కొట్టి గ్రామ బహిష్కరణ చేసిన వైసీపీ నేతలను అదేమని అడగలేదేం?
15. పల్నాడులో దళిత యువకుడు విక్రంను స్థానిక పోలీసుల సహకారంతో హైదరాబాద్ నుంచి పిలిపించి హత్య చేస్తే చనిపోయిన దళితుడి పక్షాన మీరెందుకు మాట్లాడలేదు?
16. చీరాలలో మాస్క్ ధరించలేదని దళిత యువకుడు కిరణ్ ను పోలీసులు లాఠీలతో కొట్టి కొట్టి చంపితే మీరెందుకు ప్రశ్నించలేదు?
17. గుంటూరు జిల్లా, నకరికల్లిల్లో గిరిజన మహిళ ను ట్రాక్టర్ తో గుద్దించి, ఆమెపై ఎక్కించి దారుణంగా చంపిన వైసీపీ నాయకుడ్ని మీరు ఎందుకు ప్రశ్నించలేదు?
18. మద్యం అధిక రేట్లను ప్రశ్నించిన దళిత యువకుడు ఓం ప్రతాప్ చావుకు కారణమైన పెద్దమనుషులను ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోతే మీరు అదేమని ప్రశ్నిచంలేదేం?
19. దళిత డాక్టర్ అనితా రాణిపై వైసీపీ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించి, ఆమెను అవమానిస్తే అదేమని వారిని ప్రశ్నించలేదేం? దళిత డాక్టర్ కు అండగా నిలవలేదేం?
20. పులివెందులలో దళిత మహిళను మానభంగం చేసి హత్య చేస్తే మీరెందుకు ప్రశ్నించలేదు?
21. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రేమ వివాహం చేసుకున్న జంటపై మంత్రి అనుచరులు దాడి చేస్తే మీరెందుకు మాట్లాడలేదు?
22. పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ లో పై స్థానంలో ఉన్న దళితులను కాదని దిగువ స్థానంలో ఉన్న ‘రెడ్డి’ గారిని ఇంజనీర్-ఇన్-ఛీప్ చేస్తే, రిటైర్ అయిన తరువాత కూడా ఆయన పదవీకాలం పొడిగిస్తే దళిత అధికారులకు అన్యాయం జరిగిందని నోరెత్తలేదేం.?
23. మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి పి.వి. రమేష్ పట్ల అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఒక సీనియర్ పోలీస్ అధికారి, ఆయన భార్య అయిన పివి రమేష్ సోదరిని గృహహింసకు గురిచేసి, అదనపు కట్నం కావాలని హిసించి, దౌర్జన్యం చేసి ఆమెను ఇంటి నుండి గెంటేస్తే, అదేమని ప్రశ్నించిన దళిత నాయకులను తప్పుబట్టడం మీకు న్యాయమా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్నెట్‌ లేకపోయినా వారికి బతికేహక్కుంది: రాహుల్‌గాంధీ