Publish Date: Mon, 29 Aug 2022 (11:13 IST)
Updated Date: Mon, 29 Aug 2022 (11:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి ఏర్పడివుంది. దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
తూర్పు విదర్భ నుంచి దక్షి కోస్తాంధ్ర వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. సముద్రమట్టానికి ఇది 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు ఉత్తర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పలు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని చెప్పారు. వర్ష సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని తెలిపారు. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు.
మరోవైపు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. పెద్దపవ్వూరులో 15 సెంటీమీటర్లు, ధర్మవరంలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.