Publish Date: Wed, 18 Sep 2024 (08:53 IST)
Updated Date: Wed, 18 Sep 2024 (08:52 IST)
తిరుమల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను తితిదే అధికారులు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ-సేవా టిక్కెట్ల ఎలక్ట్రానికి లక్కీడిప్ కోసం ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ టిక్కెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు.
24న ఉదయం 10 గంటలకు డిసెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల చేస్తారు.
27న ఉదయం 11 గంటలకు డిసెంబరు నెలకు సంబంధించి తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తితిదే కోరింది.
ఠాగూర్
Publish Date: Wed, 18 Sep 2024 (08:53 IST)
Updated Date: Wed, 18 Sep 2024 (08:52 IST)