Publish Date: Mon, 18 Nov 2024 (09:41 IST)
Updated Date: Mon, 18 Nov 2024 (09:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడుగా భారతీయ జనతా పార్టీకి చెందిన తిరుపతి వాసి భానుప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన తితిదే బోర్డు సభ్యుడుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన క్షేత్రస్థాయిలో తన విధుల్లో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, ఆయన భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి సామాన్య భక్తుడిగా నేలపై పడుకున్నారు. తిరుపతిలోని యాత్రి సదన్లో ఆయన ఇతర శ్రీవారి భక్తులతో కలిసి నిద్రించారు. ఈ సందర్భంగా ఆయన భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్వ దర్శనం టోకెన్స్ పెంచాలని, రూ.300 టికెట్లు నేరుగా ఇవ్వాలని భక్తులు చెప్పారు. అలాగే, భక్తులకు వసతి సౌకర్యాలను పెంచాలన్నని కోరారు. భక్తులు వెల్లడించిన అన్ని సమస్యలను తితిదే పాలక మండలి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.