Publish Date: Thu, 26 Mar 2020 (18:39 IST)
Updated Date: Thu, 26 Mar 2020 (18:41 IST)
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్థి నేపథ్యంలో పాఠశాలలు మూత పడటంతో.. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ వార్షిక పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యా శాఖను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ప్రకటించారు.
రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ విద్యా సంవత్సంలో 6 నుంచి 9 తరగతుల వరకూ పరీక్షలు లేకుండా హాజరు ఆధారంగా ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. గోరుముద్దలు పథకం కింద విద్యార్థులకు డ్రై రేషన్ ఇంటికే పంపిస్తామని తెలిపారు.
పది పరీక్షల నిర్వహణపై ఈ నెల 31 అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్ జగనన్న గోరుముద్దలు పథకం (మధ్యాహ్న భోజనం) కింద విద్యార్థులకు ఇంటి వద్దకే పౌష్టికాహారం అందించాలని సీఎం ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
కరోనా ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు డ్రై రేషన్ 10 రోజులకు అవసరమైన మొత్తం ఇస్తున్నామన్నారు. ఏప్రిల్ 14 వరకూ డ్రై రేషన్ అందిస్తామన్నారు. డ్రై రేషన్ను గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే అందిస్తామన్నారు. వచ్చేనెల 14 తర్వాత పాఠశాలలు తెరిచే అవకాశం ఉంటుందన్నారు.
ఇప్పటికే 1 నుంచి 5వ తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించామన్న ఆయన.. ఈ నెల 31 జరిగే సమీక్ష అనంతరం పది పరీక్షల తేదీలు ప్రకటిస్తామన్నారు. హాజరు ఆధారంగా 6-9 తరగతి వరకు పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.