Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిడ్కో ఇళ్ల‌పై టీడీపీ రాజ‌కీయం... ఆ ఇళ్ళు ద‌శ‌ల‌వారీగా ఇచ్చేస్తాం...

టిడ్కో ఇళ్ల‌పై టీడీపీ రాజ‌కీయం... ఆ ఇళ్ళు ద‌శ‌ల‌వారీగా ఇచ్చేస్తాం...
విజయవాడ , సోమవారం, 23 ఆగస్టు 2021 (15:25 IST)
రాష్ట్రంలో పేద‌ల‌కు ఇళ్ల పంపిణీపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంద‌ని, దీనిపై ప్ర‌తిప‌క్షం రాజ‌కీయాలు చేస్తోంద‌ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టిడ్కో ఇళ్ల‌పై తెలుగుదేశం ర‌గ‌డ చేస్తోంద‌ని, వాటిని ద‌శ‌ల వారీగా పేద‌ల‌కు త్వ‌ర‌లోనే పంపిణీ చేస్తామ‌ని మంత్రి చెప్పారు. 
 
రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కు ఎంపిక అయ్యేలా చూడాలని ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  సూచించార‌ని బొత్స తెలిపారు. దేశంలోని  పట్టణాల్లో వ్యర్ధాల మేనేజమెంట్ పై స్వచ్ఛ భారత్ కింద కేంద్రం సర్వే చేసింద‌ని, అందులో  వాటర్ ప్లస్ సర్టిఫికెట్  కోసం 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే, మన రాష్ట్రం నుంచి 3 నగరాలు ఎంపిక అయ్యాయ‌ని తెలిపారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంల‌కు ఈ సర్టిఫికెట్ వ‌చ్చింద‌ని, అన్ని పట్టణాలను ఇలానే తీర్చిదిద్దేలా  పని చేయాలని అధికారులను  సీఎం ఆదేశించార‌ని చెప్పారు.
 
రాష్ట్రంలో మొత్తం 2.60 లక్షలు టిడ్కో ఇల్లు ఉన్నాయ‌ని, వాటిని అన్ని త్వరగా ఇచ్చేస్తాం అని మంత్రి బొత్స తెలిపారు. టిడ్కో ఇళ్ళపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పస లేనివ‌ని చెప్పారు. టిడ్కో ఇళ్లను 6 నెలల్లో 80 వేలు, మరో 6 నెలల్లో మరో 80 వేలు, మిగిలినవి తర్వాత 6 నెలల్లో ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. 
ఇంటి నిర్మాణానికి డబ్బు సరిపోవడం లేదు అంటే, ఇంతకు ముందు ఎంత ఇచ్చారో గుర్తు చేసుకోవాల‌ని, విస్తీర్ణంలో చూసినా, డబ్బుల రూపంలో  కూడా ఇప్పుడు ఎక్కువగానే ఇస్తున్నామ‌ని మంత్రి చెప్పారు. నారా లోకేష్ వి అవగాహన లేని మాటల‌ని బొత్స కొట్టిపారేశారు. 
చేయూత, నేతన్న నేస్తం వంటి పథకాల వల్ల బీసీలకు న్యాయం జరుగుతోంద‌ని, వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నామ‌న్నారు. రాజధాని కేసులను రోజు వారీ విచారణను, పిటిషనర్ లు మూడు నెలలు వాయిదా అడగడం వెనుక ఏం ఉద్దేశ్యాలు ఉన్నాయో అని బొత్స అనుమానం వ్య‌క్తం చేశారు. వాళ్లే కదా కేసు వేసింది, ఎందుకు వాయిదా అడిగారు? అని ప్ర‌శ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే విధానానికి ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మంత్రి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాకుళంలో నలుగురు ఖాకీలను మింగేసిన రోడ్డు ప్రమాదం