Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి నగలు మాయమవ్వడానికి వెనుక అసలు కారణం ఇదే..?

శ్రీవారి నగలు మాయమవ్వడానికి వెనుక అసలు కారణం ఇదే..?
, మంగళవారం, 27 ఆగస్టు 2019 (22:06 IST)
టీటీడీలో మరో అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. శ్రీవారి ట్రెజరీ లో ఉండాల్సిన బంగారు వెండి నగలు మాయమైనట్లు గుర్తించారు అధికారులు. ఈ ఘటనకు బాధ్యుడిగా చేస్తూ ట్రెజరీ ఏఈవో జీతానికి కోత పెట్టడం టీటీడీలో దుమారాన్ని రేపుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే టిటిడిలో మరో కుంభకోణం వెలుగు చూసింది. నిలువు దోపిడీల రూపంలో భక్తులు శ్రీవారి హుండీలో వేసే బంగారు వెండి  నగలలో గోల్మాల్ జరిగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఒక వెండి కిరీటంతో పాటు పలు నగలు మాయమైనట్లు గుర్తించారు టిటిడి ఉన్నతాధికారులు. టీటీడీ అంతర్గత విచారణలో వెలుగుచూసిన ఈ బాగోతం బట్టబయలు అయితే ఎక్కడ టీటీడీ పరువు పోతుందని గుడ్డిగా చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ట్రెజరీ ఏఈవో శ్రీనివాసులు నెల నెల జీతంలో పనిష్మెంట్‌గా 30,000 కోత విధించినట్టు సమాచారం. ఇలా ఏడాదికిపైగా ఈ అధికారి జీతాన్ని పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం అవినీతికి పాల్పడ్డ అధికారిపై సస్పెన్షన్, విచారణకు అప్పగించటం వంటి చర్యలు తీసుకోకుండా జీతాన్ని పట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. 
 
లక్షల విలువ చేసే బంగారం మాయం అయితే కేవలం జీతంలో పట్టుకొని వదిలేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. స్వామివారి ట్రెజరీలో ఉన్న నగలలో అవకతవకలు ఉన్నట్లుగా ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల్లో ఉన్న నగలకు ట్రెజరీలో ఉన్న నగలకు లెక్కలు కుదరడం లేదన్న వాదనలు ఉన్నాయి. ఇలా మాయమైన నగలు ఏమైపోతున్నాయి అన్నది పెద్ద రహస్యంగా మారుతుందన్న విమర్శలు ఉన్నాయి.
 
టీటీడీలోని కొంతమంది ఇంటి దొంగలు ఈ వ్యవహారం వెనుక ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఎప్పటికప్పుడు లెక్కలు తేల్చి వాటిలో లోపాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కపెడుతూ వస్తుండటంపైన విమర్శలు వస్తున్నాయి.
 
శ్రీవారికి ఉపయోగించే నగలను శ్రీవారి ఆలయంలోనే భద్రపరుస్తారు. ఉపయోగించని నగలతో పాటు భక్తులు నిత్యం హుండీలో. మొక్కులు తీరినందుకుగాను నిలువు దోపిడీల రూపంలో ఒంటిమీద నగలన్నిటిని వేస్తుంటారు. ఇలా వచ్చే బంగారు వెండి నగలను హుండిలోని నగదు నుంచి వేరుచేసి తిరుపతిలోని పరిపాలన భవన్‌కు తరలిస్తారు. అక్కడ వీటి బరువు నాణ్యతను పరిశీలిస్తారు. ఏరోజుకారోజు ఈ లెక్కల ప్రక్రియ పక్కగా జరగాల్సి ఉంటుంది. 
 
వీటిని కరిగించి శ్రీవారికి ఏదైనా అవసరమైతే చేయించటం లేదా వాహనాలకు పైపోతలా వినియోగించడం లాంటివి చేస్తుంటారు. అలాగే ఆ బంగారాన్ని కరిగించే వాటిని కడ్డీల రూపంలో బ్యాంకులో డిపాజిట్ పథకంలో వడ్డీ రూపంలో ఏటా బంగారం టీటీడీకి వస్తుంటుంది. ఇవికాకుండా ఇంకా మిగిలిన నగలు ట్రెజరీలోనే ఉన్నాయి. వీటిని ట్రెజరీలోనే లాకర్లలో భద్రపరుస్తారు. ఏరోజుకారోజు లెక్కలు నమోదుకు రిజిస్టర్ కూడా ఉంటుంది. ఎన్ని నిబంధనలు ఉన్నా లెక్కల్లో తేడాలు రావడం అనుమానాలు కలిగిస్తోంది.
 
ఇంత సెక్యూరిటీ వ్యవస్థ పర్యవేక్షించే సిబ్బంది అధికారులు ఉన్న ట్రెజరీ లోని నగలు మాయం అవడం దుమారం రేపుతోంది. పైగా మాయమైన నగల అంశం బయటకు రాకుండా టిటిడి తొక్కిపెట్టటం చర్చనీయాంశంగా మారుతోంది. టిటిడి ట్రెజరీ వ్యవహారాలను పర్యవేక్షించే ప్రధాన గణాంక అధికారి బాలాజీ వ్యవహారశైలి పైన విమర్శలు వస్తున్నాయి. కేవలం క్రింది స్థాయి సిబ్బంది పైన చర్యలు తీసుకోవడంతోనే సరిపెట్టక.. ఇప్పటికైనా ఈ అంశంపై సమగ్రంగా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి దోషులను శిక్షించే ఎంతో భక్తిగా సమర్పించే శ్రీవారి కానుకలను రక్షించాలని కోరుతున్నారు భక్తులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈతకు వెళ్లి ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత