Publish Date: Thu, 04 Mar 2021 (09:42 IST)
Updated Date: Thu, 04 Mar 2021 (09:44 IST)
ఏపీ విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కుతోంది. అమరావతి రైల్వేలైన్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అమరావతి రైల్వేలైన్ ప్రాజెక్టుపై ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు నిరాశే మిగిలింది.
అమరావతి రైల్వేలైన్ ఖర్చు పంచుకోవడానికి కూడా ఏపీ సిద్ధంగా లేదని కేంద్రం పేర్కొంది. అందుకే ఆ హామీలను పక్కనెట్టినట్లు కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు.. తెలంగాణలోనూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనవసరమని కేంద్రం తేల్చింది.
ఈ ప్రకటనలతో విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలోతొక్కినట్టయ్యిందని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడా రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అవసరంలేదని రైల్వేశాఖ తేల్చిచెప్పడం గమనార్హం.
అమరావతి నూతన రైల్వే లైన్ స్వరూపమిదీ..
అమరావతికి రైల్వే ప్రాజెక్టును ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల సింగిల్ లైన్ను ప్రతిపాదించారు.
కృష్ణాజిల్లా పెద్దాపురం మీదుగా చిన్నారావు పాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం, నంబూరుల వరకు ఈ మార్గాన్ని ప్రతిపాదించారు.
అమరావతి నుంచి తిరిగి పెదకూరపాడు వరకు 25 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి నరసారావుపేట వరకు 25 కిలోమీటర్లు సింగిల్ లైన్లకు కూడా అప్పట్లో ప్రతిపాదించారు.