Publish Date: Sat, 07 Sep 2019 (18:18 IST)
Updated Date: Sat, 07 Sep 2019 (18:21 IST)
నెల్లూరులో తెలుగు భాషా అధ్యయన కేంద్రం ఖరారైందని తెలుగు భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..
"ఈరోజు తెలుగు జాతి మొత్తం గర్వించదగిన రోజు. తెలుగు భాషను రాజ భాషగా వైయస్ నాడు ప్రకటించారు. తెలుగు భాషా అధ్యయన కేంద్రం ఎపికి కావాలని కోరాం. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు హయాంలో అధ్యయన కేంద్రం పై నిర్లక్ష్యం వహించారు. జగన్ సిఎం అయ్యాక తెలుగు భాషా అధ్యయన కేంద్రం తీసుకురావాలని నిర్ణయించారు.
తెలుగు భాషా సంఘం అధ్యక్షు హోదాలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిశాను. తిక్కన నడయాడిన నేల నెల్లూరుకు అధ్యయన కేంద్రంను తీసుకుని రావాలని కోరాం. ఎనిమిది యేళ్ల కల ఇంత కాలానికి నెరవేరడం ఆనందంగా ఉంది. సిఎం జగన్ చొరవతో నేను చేసిన ప్రయత్నం ఫలించింది.
తెలుగు భాషా అధ్యయన కేంద్రం తెలుగు నేలలో ఉండేలా చేసిన వెంకయ్య నాయుడికి పాదాభివందనం. మైసూరులో ఉన్న కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది. ఇది తెలుగు ప్రజలందరూ గర్వించదగిన అంశం.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు బోధించాలి. ఈ అంశాన్ని సిఎం జగన్ కు వివరించా. ఆయన సానుకూలంగా స్పందించారు" అని వివరించారు.