Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసంపై డీజీపీకి బాబు లేఖ‌

దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసంపై డీజీపీకి బాబు లేఖ‌
విజ‌య‌వాడ‌ , సోమవారం, 3 జనవరి 2022 (15:09 IST)
దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసంలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయాల‌ని సుత్తితో ప్ర‌య‌త్నించ‌డం, వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలో భాగంగానే చేశార‌ని అన్నారు.
 
 
ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై ప్రజలు తిరుగుబాటు చేయవచ్చ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. 2019 జూన్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయ‌ని, అధికార వైసీపీ నాయకుల ఆదేశాల మేరకే జరుగుతున్నాయనడానికి వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు కుమారుడు ఎన్టీఆర్ విగ్రహ విధ్వంసమే నిదర్శనమ‌న్నారు.
 
 
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో జాతీయ నాయకులైన ఎన్టీఆర్, డా. బి.ఆర్‌ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు లాంటి విగ్రహాలను ధ్వంసం చేసే చర్యలకు అధికారపార్టీ గూండాలను ప్రోత్సహిస్తోంద‌ని, ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంద‌న్నారు.


పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలను అదుపులోకి తీసుకోవడం మాని, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాలని చంద్ర‌బాబు సూచించారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాల‌ని, నేరస్తులపై పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి విధ్వంసకర చర్యలు పునరావృతం కాకుండా అడ్డుకుంటాయ‌ని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే ఒమిక్రాన్ తోకముడుస్తుంది : ఆంటోనీ ఫౌచి