Publish Date: Sat, 21 Mar 2026 (16:37 IST)
Updated Date: Sat, 21 Mar 2026 (16:38 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన జరిగింది. బాణాసంచా లోడుతో వెళుతున్న లారీకి విద్యుత్ తీగలు తగలడంతో దగ్ధమైపోయింది. ఈ ఘటన జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. లారీకి విద్యుత్ తీగలు తగలడంతోనే ఒక్కసారిగా భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తమిళనాడులోని శివకాశి నుంచి టపాసుల లోడుతో ఓ లారీ హైదరాబాద్ వైపు వెళుతోంది. గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో.. డ్రైవర్ లారీ మార్గాన్ని గ్రామాల మీదుగా మార్చాడు. ఈ క్రమంలో శంషాబాద్ - కొత్తూరు 132 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ తీగల కింద నుంచి లారీ వెళ్తుండగా ప్రమాదవశాత్తు తీగలు తగిలి నిప్పురవ్వలు రేగాయి. డ్రైవర్ ఇది గమనించకుండా కొద్ది దూరం అలాగే పోనిచ్చాడు.
టపాసులు పేలిన శబ్దాలు రావడంతో వెంటనే లారీ ఆపి డ్రైవర్, క్లీనర్ పరుగులు తీశారు. అంతలోనే లారీ మొత్తం మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. టపాసుల శబ్దాలు సమీప గ్రామాలకు వినిపించాయి. సమీపంలోని రైతులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.