ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమకు అడ్డు చెప్పే, అడ్డుకునే భద్రతా సిబ్బంది, పోలీసులపై చేయి చేసుకుంటున్నారు. ఆలయ సందర్శనకు వెళ్లిన మంత్రి సోదరుడుని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ.. ఓ కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతలే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జరిగిన ఘటన వివరాలను పరిశీలిస్తే,
నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని ఆలయ సందర్శన కోసం ఏపీ రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు బీసీ మదన్ భూపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో లోపలికి వెళుతున్న ఆయనను అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. అది నిషేధిత ఏరియా అని అటు వైపు ఎవరూ వెళ్లడానికి వీలు లేదని కానిస్టేబుల్ చెప్పారు. ఈ మాటలను ఏమాత్రం పట్టించుకోని మదన్ భూపాల్ రెడ్డి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ ఘటనతో ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు కలుగజేసుకుని కానిస్టేబుల్పై దాడి చేసిన మదన్ భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, తన సోదరుడు చేసిన పనిని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బహిరంగంగానే ఖండించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఈ ఘటనపై వైకాపా నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యుల అహంకారానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అని మండిపడుతున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.