Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాడేపల్లి ప్యాలెస్ విసిరే బిస్కట్లకు ఆశపడిన కొందరు ఉద్యోగ సంఘాల ‘బాడుగ నేతలు’ అయ్యారు: పట్టాభిరామ్

తాడేపల్లి ప్యాలెస్ విసిరే బిస్కట్లకు ఆశపడిన కొందరు ఉద్యోగ సంఘాల ‘బాడుగ నేతలు’ అయ్యారు: పట్టాభిరామ్
, సోమవారం, 25 జనవరి 2021 (20:41 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం నుంచి న్యాయంగా వారికి దక్కాల్సిన అనేక ప్రయోజనాలను గాలికొదిలేసి, సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తూ, జగన్‌కు ఊడిగం చేస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగలపక్షాన, బాడుగనేతలను నిలదీయ డానికే తాను మీడియా ముందుకొచ్చినట్లు పట్టాభి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... తాడేపల్లి ప్యాలెస్ వేసే బిస్కట్లకు ఆశపడి, ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొంచిన ఉద్యోగసంఘ ‘బాడుగ నేతలు’ ఒకపక్కనుంటే, నిజాయితీగా రాజ్యాంగానికి లోబడి పనిచేయడానికి సిద్ధమైన లక్షలాదిమంది ఉద్యోగులు మరోపక్కన రాష్ట్రంలో ఉన్నారు. ఇటువంటి దిక్కుమాలిన ఉద్యోగ సంఘాల నేతలను ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామని స్వయంగా ఉద్యోగులే వాపోతున్నారు.
 
బాడుగ నేతలకు దమ్ముంటే ఉద్యోగుల పక్షాన నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలి. నాకు సమాధానం చెప్పే ధైర్యం లేకుంటే, కనీసం సాటి ఉద్యోగులకైనా వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. రెండ్రోజుల నుంచి వేలాదిమంది ఉద్యోగులు నాకు ఫోన్ చేసి, వారి సమస్యలు, అనేక అంశాలను చెప్పుకున్నారు కాబట్టే, నేడు మీడియా ముందుకొచ్చి, ఉద్యోగ సంఘాల నేతల పనితీరుని, లక్షలాదిమంది ఉద్యోగుల తరుపున నిలదీస్తున్నాను.
 
జగన్ ముఖ్యమంత్రయ్యాక, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా, ఏపీ జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్) నిధులు ఉద్యోగులకు సక్రమంగా అందుతున్నాయా? 8 నెలలు గడుస్తున్నా, జగన్ ముఖ్యమంత్రయ్యాక ఏ ఉద్యోగికైనా ఏపీజీపీఎఫ్ నిధులు కోరిన విధంగా అందుతున్నాయా? ఉద్యోగులకు సంబంధించిన ఏపీ జీపీఎఫ్ సొమ్ముపై జగన్ పెత్తనమేంటి? ఆ నిధులను ఆపడానికి, ఆంక్షలు విధించడానికి ఆయనెవరని నిలదీస్తున్నాను.
 
ఉద్యోగులకు సంబంధించిన ఏపీ జీపీఎఫ్ నిధులను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రికి ఏం అధికారముంది? ఆ నిధులను కూడా మింగేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా తీవ్రమైన మనోవేదన అనుభవిస్తుంటే, ఉద్యోగసంఘాల నేతలు ఎక్కడ గడ్డి పీకుతున్నారు? ఉద్యోగస్తుల సమస్యలు, బాధలు, వారి హక్కులను పట్టించుకోని వారు ఉద్యోగసంఘాల నాయకులా? 
ఏపీ జీఎల్ఐ (గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్)కి సంబంధించి ఉద్యోగులకు చెందిన ఒక్క క్లెయిమైనా జగన్ ముఖ్యమంత్రయ్యాక పరిష్కారమైందా? ఉద్యోగులకు చెందాల్సిన లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిములు కూడా పరిష్కరించలేని దుస్థితిలో బాడుగనేతలు ఉన్నారా?
 
ఉద్యోగి రిటైర్అయితే గ్రాట్యుటీ, పెన్షన్ సొమ్ముకోసం ఆరేడునెలలు చెప్పులరిగేలా తిరుగుతున్న ఉద్యోగులు బాడుగనేతలకు కనిపించడం లేదా? ప్రభుత్వ ఉద్యోగికి గ్రాట్యుటీ సొమ్ము ఇవ్వకుండా తిప్పించుకోవడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా?  ప్రభుత్వ ఉద్యోగికి దక్కాల్సిన సరెండర్ లీవుల తాలూకా సొమ్ముని కూడా ఉద్యోగులకు ఇప్పించలేని దుస్థితిలో ఉద్యోగ సంఘాల నేతలున్నారు. 
అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్‌ను నిలదీయడానికి బాడుగనేతలు ఎందుకు ధైర్యం చేయడంలేదు?
 
ఉద్యోగుల సీపీఎస్ గురించి, తాడేపల్లిలో రాజభోగాలు అనుభవిస్తున్న జగన్‌ను అడిగే దమ్ము బాడుగ నేతలకు లేదు.  రాష్ట్రప్రభుత్వం తనవాటాగా ఉద్యోగుల పక్షాన సీపీఎస్ సొమ్ముని సక్రమంగా చెల్లిస్తోందా? దానికి సంబంధించిన లెక్కలు తీయమని వైసీపీ ప్రభుత్వాన్ని, ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు నిలదీయడంలేదు? చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో సీపీఎస్ చెల్లింపుల్లో దేశంలోనే ఏపీ నెం-1స్థానంలో నిలిచింది.  సీపీఎస్‌కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపాయి కూడా జమ చేయకపోతుంటే, సదరు ప్రభుత్వానికి కొమ్మకాస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు ఏ కలుగులో దాక్కున్నారు.
 
30 నెలల నుంచీ ఇవ్వాల్సిన పీఆర్సీ సంగతేంటి? ఏప్రియల్ -2018లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ గురించి జగన్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు? కొద్ది నెలల క్రితం పీఆర్సీకి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందినా పాలకులు ఎందుకు తొక్కిపెట్టారు? దానిపై ఉద్యోగుల పక్షాన జగన్‌ను ఉద్యోగసంఘాల నేతలుఎందుకు నిలదీయరు? ఉద్యోగ సంఘాల నాయకులు నోళ్లు ఎందుకు పెగలడంలేదు? పీఆర్సీ, సీపీఎస్, ఎల్ టీసీలు, 6 డీఏల పెండింగ్ వ్యవహారంపై జగన్‌ను నిలదీయలేని అసమర్థులు, ఉద్యోగసంఘాల నాయకులా? వారికి దమ్ముంటే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను పరిష్కరించమని జగన్‌ను నిలదీయాలి.
 
ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసిన పనికిమాలిన బాడుగనేత ఒకడు నిన్న పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఉద్యోగులను వేధించుకు తిన్నాడంటూ తనతాటిమట్ట నోటితో ఏదేదో మాట్లాడాడు. చంద్రబాబునాయుడు అత్యధికంగా 43శాతం ఫిట్మెంట్‌తో ఉద్యోగుల ఎరియర్స్ మొత్తం క్లియర్ చేశారు. సీపీఎస్ పథకంలో భాగంగా గ్రాట్యుటీ,  ఫ్యామిలీ పెన్షన్‌ను కూడా అందించిన ఘనత దేశంలో చంద్రబాబుకే దక్కింది.
 
జిల్లా కేంద్రాల్లో హెచ్ఆర్ ఏను 12 శాతం నుంచి 20 శాతానికి పెంచింది టీడీపీ ప్రభుత్వం కాదా? పదవీ విరమణ వయస్సుని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది చంద్రబాబు నాయుడు కారా? పదవీవిరమణ అనంతరం పెన్షనర్స్ 10 శాతం వెయిటేజీని 75 నుంచి 70 ఏళ్లకు తగ్గించిన విషయం బాడుగనేతలకు తెలియదా? చంద్రబాబునాయుడు ఉద్యోగులను వేధించుకు తిన్నాడని పిచ్చికూతలు కూసిన వ్యక్తి, వీటిపై ఏం సమాధానం చెబుతాడు?
 
చంద్రబాబునాయుడి హయాంలో పనిచేసుకుంటూ సుఖసంతోషాలతో ఉన్నామని ఉద్యోగులే చెబుతున్నారు. సజ్జల వేసే బిస్కట్లకు ఆశ పడకుండా ఏపీ జీపీఎఫ్ నిధులు, ఏపీ జీఎల్ఐ, 30 నెలల నుంచీ పెండింగ్‌లోఉన్న పీఆర్సీ రిపోర్ట్, అటకెక్కిన సీపీఎస్ రద్దు, 6 డీఏల పెండింగ్, సరెండర్ లీవు బకాయిలపై ఉద్యోగ సంఘాలనేతలకు దమ్ముంటే  ఆయన కాలర్ పట్టుకొని నిలదీయాలి. సీపీఎస్ కాంట్రిబ్యూషన్ ఎందుకు సక్రమంగా చెల్లించడంలేదో అడగండి. ఆఖరికి ఎల్టీసీల కోసం కూడా ఉద్యోగులు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని దేబిరించాలా?
 
జగన్ ప్రభుత్వం ఈ విధంగా ఉద్యోగులకు దక్కాల్సిన అనేక ప్రయోజనాలను గాలికొదిలేసి, వారిని అన్నిరకాలుగా వేధిస్తుంటే, రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా పనికిమాలిన బాడుగనేతలు రాజకీయాలు మాట్లాడతారా? గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండగానే, అక్కడి ఉద్యోగులు నిబద్దతతో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి సహకరించడం జరిగింది. అక్కడ జరిగిన రాజ్యాంగబద్ధ ప్రక్రియ ఇక్కడున్న ఉద్యోగసంఘాల బాడుగ నేతలకు కనిపించ లేదా?
 
జగన్ మోచేతి నీళ్లు తాగే బాడుగ నేతలతో తమకు పనిలేదని లక్షలమంది ఉద్యోగులు బహిరంగంగానే చెబుతున్నారు. కొంతమంది పనికిమాలిన బాడుగ నేతల చేతుల్లో తాము పావులం కాబోమంటూ వారే, ఉద్యుగుల సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేయడానికి టీడీపీ సిద్ధమవుతోంది. నేడు నామినేషన్ పత్రాలు వేయడానికి అనేక మంది దళిత, బీసీ, మైనారిటీ లక్షలాది యువకులు సిద్ధంగా ఉన్నారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఏ ఉద్యోగసంఘం నాయకుడు బయటకు వస్తాడో చూస్తాను.
 
భవిష్యత్‌లో జగన్ ఇచ్చే పదవులకు ఆశ పడటం మానేసి, ఉద్యోగులకు ఏంసమాధానం చెబుతారో చెప్పండి? పైరవీలకో, ఏసీబీ కేసులకు భయపడో ప్రశ్నించడం మానేయకండి. సచివాలయ ఉద్యోగసంఘాల నేత తను ఏదో ఫెడరేషన్ పేరు చెబుతున్నాడు. ఆ ఫెడరేషన్ ఆయనొక్కడే తన బెడ్రూమ్‌లో ఏర్పాటుచేసుకున్నాడేమో. ఆయన సంక్రాంతి సందర్భంగా వేలాదిమందిని పోగుచేసి, భోజనాలు పెట్టినప్పుడు, వ్యాక్సినేషన్ సంగతి సచివాలయ సంఘం నేతకు గుర్తకురాలేదా? అందరినీ బెదిరించి, బలవంతంగా ఆపదవిలో కూర్చున్నాడు కదా?
 
సచివాలయ సంఘం సంక్రాంతికి ఏ కార్యక్రమం నిర్వహించినా గత ప్రభుత్వం సాయం చేసేది, మరి ఈప్రభుత్వం ఈ సంవత్సరం రూపాయికూడా ఇవ్వలేదు కదా... దానిగురించి ప్రభుత్వాన్ని అడగటానికి ఆయనకు నోరు రాలేదా? కరోనా సమయంలో తాము ఇళ్లలో ఉండి పనిచేస్తామని ఉద్యోగులంతా వేడుకున్నప్పుడు, లేదు కుదరదు, అందరూ విధిగా సచివాలయానికి వచ్చి పనిచేయాలని జగన్ ప్రభుత్వం హుకుం జారీచేసినప్పుడు ఈ నాయకుడు ఏమైపోయాడు? ఆనాడు ఇతనికి కరోనా గుర్తుకురాలేదా? ఇప్పటికైనా ఆయన చిలకపలుకులు మానేసి, తాను అడిగిన ప్రశ్నలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యక్తిని బూటు కాళ్లతో తొక్కి లాఠీలతో చితకబాది మీ ఆయన్ని తీస్కెళ్లన్న పోలీసులు