Publish Date: Wed, 20 Oct 2021 (21:59 IST)
Updated Date: Wed, 20 Oct 2021 (22:00 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి మంగళవారం అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆపై టీడీపీ నేతలు, ఆఫీసులపై దాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య పోలీసులు వాహనంలో గవర్నర్ పేటకు తరలిస్తున్నట్లు సమాచారం. అరెస్ట్ చేస్తున్న సమయంలో పట్టాభి ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది.
ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే చూపించలేదని పట్టాభి భార్య ఆరోపించారు. 120 బి సెక్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారని పట్టాభి భార్య మీడియాకు తెలిపారు. తన భర్త ఎలా వెళ్లారో అలాగే ఇంటిికి రాకపోతే ఏపీ ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలన్నారు. తలుపులు బద్ధలుకొట్టుకుని వచ్చి మరీ తన భర్తను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి గాయాలు లేవని, అరెస్ట్ తరువాత తనకు గాయాలు అయితే పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత అని పట్టాభి అన్నారు.