Publish Date: Wed, 26 May 2021 (17:27 IST)
Updated Date: Wed, 26 May 2021 (17:29 IST)
చాలామంది పాములను చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. కొందరు మాత్రం దైర్యంగా వాటిని పట్టుకొని దూరంగా వదిలేస్తారు. అయితే ఆలా దూరంగా వదిలేద్దామని దుకాణంలోకి వచ్చిన పామును పట్టుకున్న ఓ వ్యక్తి పాము కాటుకు గురై ప్రాణాలు విధించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని బైరెడ్డిపల్లె మెయిన్ రోడ్డులో ఉన్న జ్యువెలరీ షాపులోకి ఓ పాము వచ్చింది. పాము యజమాని దానిని చూసి బయటకు వచ్చాడు.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆసాదుల్లా (52) దుకాణంలో ఉన్న పామును చూసి దానిని పట్టుకున్నాడు. కొద్దిసేపు దానితో చలగాటమాడాడు. పాము తలను చేతిలో పట్టుకుని ఏమరపాటుగా ఉన్న సమయంలో ఆసాదుల్లా చేతిపై కాటు వేసింది. దీంతో అతడు పామును చంపి ఆసుపత్రికి వెళ్ళాడు. పరిస్థితి విషమించడంతో గుట్టూరు జేఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పలమనేరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
కాగా నిర్లక్ష్యం నిండుప్రాణం తీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఆసాదుల్లాకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తండ్రి మరణించడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.