Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొగ్గు కొరత రాకుండా చూడండి: జగన్‌

బొగ్గు కొరత రాకుండా చూడండి: జగన్‌
, సోమవారం, 18 అక్టోబరు 2021 (20:04 IST)
రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం నిశితంగా సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు.

మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి రెండు ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని అధికారులు వివరించారు. జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు.

సింగరేణి సహా కోల్‌ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచనలు చేయాలని.. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

దీని కోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు తెలిపారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు.

6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. స‌మీక్ష‌లో ఇంధన శాఖకార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మామయ్యా, అమ్మ మరొకడితో ఆటోలో ఎక్కి వెళుతోంది: దారి కాచి హత్య చేశారు