Publish Date: Fri, 29 Jan 2021 (19:40 IST)
Updated Date: Fri, 29 Jan 2021 (19:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తొలి దశ పోలింగ్కు శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. అదేసమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకగ్రీవాలపై పలు పార్టీల నేతలు గవర్నర్ను కలిశారన్నారు. ఏకగ్రీవాల కోసం ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.
పత్రికల్లో ప్రకటన ఇచ్చిన అధికారులను వివరణ కోరామన్నారు. ఎస్ఈసీకి తెలియకుండా ప్రకటనలు ఎలా ఇస్తారు? అని నిమ్మగడ్డ ప్రశ్నించారు. సామరస్యంగా ఏకగ్రీవాలు చేయడం సరైన సంస్కృతి అని వ్యాఖ్యానించారు. బలవంతం చేసి, భయపెట్టి ఏకగ్రీవాలు చేయడం సరికాదని విమర్శించారు.
భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం సాధించడమే ప్రజాస్వామ్యమన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకగ్రీవాలకు ప్రయత్నించే వారిపై.. అధికారులు నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎన్నికల్లో అనవసరంగా జోక్యం చేసుకుని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసేవారిని హౌస్ అరెస్ట్ చేస్తామని నిమ్మగడ్డ రమేష్కుమార్ హెచ్చరించారు.
మరోవైపు, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. సజ్జల లక్ష్మణ రేఖ దాటారని తన లేఖలో పేర్కొన్నారు.
సజ్జలతో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా వారి పరిధులు దాటి మాట్లాడుతున్నారని నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. తనపై మంత్రులు చేస్తున్న విమర్శలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయన్నారు. అడ్వొకేట్ జనరల్పై కూడా తనకు నమ్మకం లేదన్నారు. కోర్టుకు వెళ్లకుండా ముందుగా ఈ విషయాలన్నింటినీ తమ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు.
అలాగే, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ను తొలగించాలని, అలాగే ఎన్నికల నేపథ్యంలో, కుల ధృవీకరణ పత్రాలపై జగన్ ఫొటోలను తొలగించాలని నిమ్మగడ్డ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఓటర్లపై ఈ ఫొటోలు ప్రభావం చూపుతాయన్నారు. అభ్యర్థులకు ఇచ్చే ఓన్ఓసీల విషయంలో కూడా వివక్ష లేకుండా చూడాలని అధికారులను కోరారు.