Publish Date: Wed, 08 Jul 2020 (15:25 IST)
Updated Date: Wed, 08 Jul 2020 (15:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు పునర్నియమించాలన్న హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కారుకు నిరాశ తప్పలేదు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై స్టే ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు నిరాకరించింది.
మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అటు, ఎన్నికల నిర్వహణపైనా మాట్లాడదలుచుకోలేదని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు.
హైకోర్టు ఉత్తర్వుల కారణంగా గతంలోని అధికారులు కూడా పనిచేయలేకపోతున్నారని వివరించారు. మధ్యంతర ఎస్ఈసీని నియమించేలా గవర్నరుకు సూచించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
అయితే ఏపీ ప్రభుత్వ న్యాయవాది సూచనలను న్యాయస్థానం తిరస్కరించింది. గవర్నరుకు ఈ దశలో సూచన చేయలేమని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తేల్చి చెప్పారు. మరో మూడు వారాల తర్వాత తుది వాదనలు వింటామంటూ తదుపరి విచారణను ఆ మేరకు వాయిదా వేశారు.