Publish Date: Sat, 14 Sep 2019 (11:39 IST)
Updated Date: Sat, 14 Sep 2019 (11:40 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైకాపా నేత, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజాకు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు.
సీఎం జగన్ సుపరిపాలనను ఓర్వలేక చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. యరపతినేని, కోడెల వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా వున్నారని వెల్లడించారు.
కోడెల, యరపతినేని, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, బోండా ఉమా బాధితుల కోసం చంద్రబాబు పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు. పల్నాడులో అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇకనైనా నాటకాలు ఆపకపోతే ప్రజలు తరిమికొడతారని చంద్రబాబుని హెచ్చరించారు.