Publish Date: Mon, 27 May 2019 (15:36 IST)
Updated Date: Mon, 27 May 2019 (15:37 IST)
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ డిక్టేటర్ అవగలడని టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం వెస్ట్ గోదావరి జిల్లాలో మాట్లాడుతూ, 'పవన్ ఎంతో నిజాయతీ ఉన్న వ్యక్తి. నికార్సయినవాడు. అయితే నేను పవన్ కల్యాణ్ కు సలహా ఇస్తున్నానని భావించడంలేదు. నా అభిప్రాయం మాత్రం చెప్పగలను. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఓ డిక్టేటర్ అవగలడు, అంటే, అది చెడుగా కాదు, పాజిటివ్గానే పవన్ ఓ తిరుగులేని శక్తి లాంటివాడు. ఎందుకంటే ఇప్పుడు పవన్ ఎవరితోనూ పొత్తులో లేడు, తానొక్కడే ఉన్నాడు కాబట్టి, ఎలాంటి నిర్ణయమైనా ధైర్యంగా తీసుకోగలిగే శక్తి ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో అలాంటి నిర్ణయాలు కరెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి, కొన్ని సందర్భాల్లో అవి తప్పు అవొచ్చు.
ఒక సూపర్ స్టార్గా వచ్చి ఇంతటి నిరాశాజనక ఫలితాన్ని చవిచూసినప్పుడు పవన్ కల్యాణ్కు అర్థమయ్యే ఉంటుంది. ఈ ఐదేళ్లలో తాను ఎంతోమందిని డీల్ చేసి ఉంటాడు. రాజకీయాల్లో ఇమడగలనా? లేదా? అనేది దాన్నిబట్టే తాను అర్థంచేసుకోవాలి. అమితాబ్ బచ్చన్ అంతటివాడే రాజకీయాల్లోకి సరిపడనని నిర్ధారించుకున్నాడు. అయితే అమితాబ్లా కాకుండా పవన్ నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ తన వ్యక్తిత్వంతో పార్టీని నడిపించగలడా? లేక, సినిమాల్లోకి తిరిగి వస్తాడా? అంటే దానిపై నేను స్పష్టంగా చెప్పలేను' అని వర్మ అభిప్రాయపడ్డారు.