Publish Date: Sat, 07 May 2022 (08:50 IST)
Updated Date: Sat, 07 May 2022 (09:02 IST)
తెలుగు రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే వార్త. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
దక్షిణ అండమాన్ సముద్రం, ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తమిళనాడు, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, యానాం ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకట్రెండు చోట్ల ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు.
ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు అలెర్ట్గా ఉండాలని సూచించారు. రాయలసీమ జిల్లాలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు.