Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజల తరుపున ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా?.. టీడీపీ అధికార ప్రతినిధి వ‌ర్ల రామ‌య్య‌

ప్రజల తరుపున ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా?.. టీడీపీ అధికార ప్రతినిధి వ‌ర్ల రామ‌య్య‌
, మంగళవారం, 23 జులై 2019 (19:47 IST)
ఎన్నికల సమయంలో వైసీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్ష సభ్యులు శాసనసభలో అధికార పక్షాన్ని కోరితే సభ నుంచి సస్పెండ్‌ చేస్తారా? ఆచరణకు అమలు కానీ హామీలు ఇచ్చిన జగన్‌... వాటిని అమలు చేయమని కోరితే సమాధానం చెప్పలేక, సభలో తన సంఖ్యా బలాన్ని చూసుకొని విర్రవీగుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య మండిపడ్డారు.

మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసనసభలో ప్రతిపక్షం వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారపార్టీకి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలో వచ్చిన వైసీపీ అమలు చేయకుండా బుకాయిస్తోందని వర్ల ధ్వజమెత్తారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా? అని నిలదీశారు. ప్రస్తుతం నడుస్తున్న సభను చూస్తే ఇది శాసనసభ కాదు... అనైతిక సభ అనే విధంగా వైసీపీ ప్రవర్తన ఉందని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాలు చేసే సభలో అలవోకగా అబద్ధాలు ప్రచారం చేస్తూ అధికార పక్షం పబ్బం గడుపుకుంటోందని నిప్పులు చెరిగారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌తో సభ విశ్వసనీయత, ఔదార్యం కోల్పోయిందన్నారు. అశ్వద్ధామహ కుంజరహా అన్నట్లుగా సీఎం జగన్మోహన్‌రెెడ్డి వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 45 ఏళ్లకు పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చిన జగన్‌... అధికారంలోకి వచ్చిన అనంతరం మాట తప్పడమే కాకుండా, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని శాసనసభలో నిలదీసిన టీడీపీ సభ్యుల్ని సస్పెండ్‌ చేయడం హేయమైన చర్య అని అన్నారు.

ఈ  విషయంలో రాష్ట్ర ప్రజలకు జగన్‌ క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. సభ నుంచి సస్పెండ్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలను తిరిగి సాదరంగా హౌస్‌లోకి తీసుకురావాలి. అధికారపక్షం సభలో హుందాతనాన్ని అలవరుచుకోని తోటి సభ్యులను గౌరవించుకోవడం నేర్చుకోవాలని హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రౌడీ షీటర్ వేధింపులు .... బ్యూటీషియన్ ఆత్మహత్య