Publish Date: Wed, 06 Apr 2022 (12:18 IST)
Updated Date: Wed, 06 Apr 2022 (12:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు రోత పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. రాత్రిపగలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలే మండుతున్న ఎండలు... దీనికితోడు స్వైర విహారం చేస్తున్న దోమలు, మరోవైపు విద్యుత్ కోతలు వెరసి జనం భరించలేని బాధపడుతున్నారు.
ఈపీడీసీఎల్లో విలీనమైన కశింకోట ఆర్ఈసీఎస్ పరిధిలో అప్రకటిత విద్యుత్ కోతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మండల కేంద్రమైన కంచికోట విద్యుత్ సెక్షన్ పరిధిలో ఎమర్జెన్సీ లోడు రిలీఫ్ పేరుతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో రాత్రి వేళ దుకాణాలు, హోటళ్లు, జెరాక్స్ షాపులు, చిన్నచిన్న కిరాణా షాపుల యజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.