జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టయిన సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అనారోగ్యం పేరుతో డ్రామాలు ఆడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని.. అనారోగ్యంగా ఉందంటూ పోలీసులను కంగారు పెట్టించారు. దీంతో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. మరిన్ని మెరుగైన వైద్య పరీక్షల కోసం కడప రిమ్స్కు తరలించారు. రిమ్స్లోనూ వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు.
అయితే, పోసాని ఈ డ్రామాలు ఆడటానికి కారణాలు లేకపోలేదు. శనివారం ఉదయం ములాఖత్లో పోసానిని రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిసి పరామర్శించారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే పోసానికి ఛాతినొప్పి ప్రహసనం మొదలైంది. దీంతో ఆయనకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయించగా, అది కేవలం నాటకమని తేలిపోయింది.
ఇదే అంశంపై రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చాతి నొప్పి పేరుతో పోసాని డ్రామాలు ఆడారని తెలిపారు. పోసాని అడిగిన అన్ని రకాల వైద్యపరీక్షలు చేయించాం. ఎలాంటి అనారోగ్యమూ లేదని తేలింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. ఆయనను తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నాం అని వెల్లడించారు.