Publish Date: Sun, 28 May 2023 (13:37 IST)
Updated Date: Sun, 28 May 2023 (13:38 IST)
శత పురుషుడు నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 101వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధానమంత్రి మోడీ... శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్కు వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు.
రాజకీయాలతో పాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్ జీవం పోశారన్నారు.
బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీరంగంలో ఖ్యాతిగాంచారు. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనను ఇప్పటికీ స్మరిస్తారని గుర్తు చేశారు.
దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమన్న మోడీ.. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నినాదాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని హితోపదేశం చేశారు. యువ సంగమం పేరుతో విద్యాశాఖ ఓ కార్యక్రమం చేపట్టిందన్న ప్రధాని.. ప్రజలను ప్రజలతో మమేకం చేయడం, దాని ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోడీ తెలిపారు.