Publish Date: Sun, 28 May 2023 (12:25 IST)
Updated Date: Sun, 28 May 2023 (12:06 IST)
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహా నటుడు ఎన్టీఆర్ అని జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
'చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది.. ఎందరికో అనుసరణీయమైంది.
ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి 'ఆత్మ గౌరవం' అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచారు. అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటారు. అటు సినిమా.. ఇటు రాజకీయ రంగంల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా తరఫున, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నానుట అని పవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.