Publish Date: Sat, 14 Aug 2021 (15:15 IST)
Updated Date: Sat, 14 Aug 2021 (15:19 IST)
విభజన కష్టాలను ఇంకా మర్చి పోలేం... ఈ మాట అన్నది ఆంధ్రప్రదేశ్ గురించి కాదు... భారత దేశం గురించి... అన్నది ఎవరో కాదు... భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఆగస్టు 14న విభజన భయానక జ్ఞాపక దినంగా పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఇండియా విభజన సందర్బంగా ప్రజలు బాధలను, కష్టాలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్న ప్రధాని, ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్గా జరుపుకోవాలని ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.
దేశ చరిత్రలో విభజన కష్టాలను ఎన్నటికీ మర్చిపోలేమని, విభజన సమయంలో ప్రజల పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది సోదర సోదరీ మణులు విడిపోవాల్సి వచ్చింది. అప్పటి ద్వేషం, హింస కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్వీట్ చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్గా జరుపు కోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా సామాజిక విభేదాలు, అసమానతలు అనే విషాన్ని తొలగించడంతోపాటు, ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.