Publish Date: Sat, 02 Nov 2019 (17:31 IST)
Updated Date: Sat, 02 Nov 2019 (17:32 IST)
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని అదేవిధంగా పింగళి వెంకయ్య జయంతి, వర్థంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పింగళి వెంకయ్య మనవరాలు, పింగళి దశరధరామ్ భార్య (ఎన్కౌంటర్ దశరధరామ్) పింగళి సుశీల విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలును శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య మనవరాలు, పింగళి దశరధధిరామ్ భార్య (ఎన్కౌంటర్ ధశరధిరామ్) పింగళి సుశీలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మహ పురుషులు చేసిన త్యాగాలను స్మరించుకుని, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానించడం వేడుకలలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా పింగళి సుశీల గవర్నర్, ముఖ్యమంత్రికి వివరించారు.