ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కె.నాగబాబు నామినేషన్ పత్రాలు దాఖలు సందర్భంగా తన ఆస్తులు, అప్పులు వివరాలు వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన ఆఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం నాగబాబు మ్యాచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో రూ.55.37 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆయన వద్ద చేతిలో రూ.21.81 లక్షల నగదు, బ్యాంకులో రూ.23.53 లక్షలు ఉండగా ఇతరులకు రూ.1.03 కోట్లు అప్పుగా ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. అలాగే, తన వద్ద రూ.67.28 లక్షల విలువైన బెంజ్ కారు, రూ.11.04 లక్షలు విలువైన హ్యందయ్ కారు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు.
రూ.18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం తన వద్ద రూ.16.50 లక్షల విలువైన 55 క్యారెట్లు వజ్రాలు, రూ.57.9 లక్షలు విలువైన 724 గ్రాముల బంగారం రూ.21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి తన భార్య వద్ద ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, తనకు, తన భార్యకు కలిసి రూ.59.12 కోట్ల చరాస్తులు ఉన్నట్టు తెలిపారు.
ఇక స్థిరాస్తులు విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల రూ.3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి, మెదక్ జిల్లా నర్సాపూర్ రూ.32.80 లక్షలు విలువైన 3.28 ఎకరాలు అదే ప్రాంతంలో రూ.50 లక్షలు భూమి విలువ చేసే ఐదు ఎకరాలు, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో రూ.53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూమి ఉంది.
హైదరాబాద్లోని మణికొండలో రూ.2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా కలిపి మొత్తంగా రూ.11.20 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక, అప్పుల విషయానికి వస్తే రెండు బ్యాంకుల్లో రూ.56.97 లక్షలు గృహరుణం, రూ.754895 కారు రుణం ఉన్నాయి. అలాగే, ఇతర వ్యక్తుల వద్ద రూ.1.64 కోట్ల అప్పులున్నాయి. అన్న చిరంజీవి నుంచి రూ.28.48 లక్షలు, తమ్ముడు పవన్ కళ్యాణ నుించి రూ.6.9 లక్షలు అప్పు తీసుకున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు.