తనకు ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుందని తనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని వైకాపా నేత, ప్రముఖ రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆరోపిస్తూ ఓ సెల్పీ వీడియోను విడుదల చేశారు. గత నాలుగు నెలలుగా టీడీపీ కూటమి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొంటూ కంటతడి పెట్టుకుంటూ ఈ వీడియోను విడుదల చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ల వల్ల తనకు ప్రాణహాని ఉంది, వాళ్ల నుంచి తనను కాపాడాలని ఆయన వేడుకున్నారు. తనకు ఏమైనా జరిగితే అందుకు లోకేశ్, పవన్ కళ్యాణ్లదే బాధ్యత అని అన్నారు. తనకు దేవుడు, జగన్,, వైకాపానే దిక్కు అని పేర్కొన్నారు.
అనంతపురంలో తనకు బెయిల్ వచ్చే సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర చేశారని ఆరోపించారు. కర్నూలులో పోలీసులు తను చిత్రహింససలు పెట్టారని వాపోయారు. తన తల్లికి అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగిందని, ఆమెను చూసుకోవాల్సింది తానేనని చెప్పారు.
తన తల్లి ఆరోగ్యం విషయంలో కోర్టు తప్పుడు ధృవపత్రాలు సమర్పించానని పోలీసులు చెబుతున్నారని, ఆ సమయంలో తాను జైల్లో ఉన్నానని, అలాంటి సమయంలో నకిలీ ధృవపత్రాలు ఎలా సృష్టిస్తానని బోరుగడ్డ ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయస్థానాలంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం చెన్నైలో ఉండి తన తల్లిని చూసుకుంటున్నాని, తనకు జగన్, వైకాపా తప్ప ఎవరూ లేరని వాపోయారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు పగవాడికి కూడా రాకూడదని వీడియోలో ఆయన పేర్కొన్నారు.