ఫ్యామిలీ సభ్యులను ఆహ్వానించను.. చెర్రీ వ్యాఖ్యలపై పవన్
జనసేన పార్టీలోకి కుటుంబ సభ్యులను ఆహ్వానించబోనని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. అయితే ఎవరైనా స్వతహాగా పార్టీలోకి వస్తానంటే మాత్రం ఆహ్వానిస్తానని చెప్పారు.
Publish Date: Wed, 30 May 2018 (08:49 IST)
Updated Date: Wed, 30 May 2018 (08:50 IST)
జనసేన పార్టీలోకి కుటుంబ సభ్యులను ఆహ్వానించబోనని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. అయితే ఎవరైనా స్వతహాగా పార్టీలోకి వస్తానంటే మాత్రం ఆహ్వానిస్తానని చెప్పారు.
తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిస్తే ఆ పార్టీ తరపున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు రామ్ చరణ్ తేజ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పవన్ తాజాగా స్పందించారు.
ఎవరైనా స్వతహాగా వస్తే తన పార్టీలోకి ఆహ్వానిస్తానని, అంతేగానీ తన కుటుంబ సభ్యులను రమ్మని అడగబోనని తేల్చిచెప్పారు. పైగా, రాజకీయాల్లోకి రావాలంటే చాలా నిబద్ధత ఉండాలని, ఇష్టపడి రావాలన్నారు. అందువల్ల రాజకీయాల్లోకి వచ్చేవారిని ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని రమ్మని అంటానని చెప్పారు.
ఇకపోతే, తన కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని, వారికెందుకు ఇబ్బంది? అలాంటి వారిని తాను ఇబ్బంది పెట్టదలచుకోలేదనీ, అంతకు మించి దీనిపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని పవన్ చెప్పుకొచ్చారు.