Publish Date: Mon, 15 Nov 2021 (10:37 IST)
Updated Date: Mon, 15 Nov 2021 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు సెటైర్లు వేశారు. ఎయిడెడ్ స్కూళ్లను ఏపీ ప్రభుత్వం విలీనం చేసుకుంటుండటంపై తొలి నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కర్ణాటకలోని మంగళూరు ప్రాతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి పాఠశాలను నిర్మించి... దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని పొందిన సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని పవన్ ఉటంకిస్తూ... 'పండ్ల వ్యాపారి, పద్మశ్రీ పురస్కార గ్రహీత హరికేళ హజబ్బ తన సొంత సంపాదనతో పాఠశాలను ఎలా నిర్మించగలిగారు? ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తోంది' అంటూ విమర్శించారు.
అంతేకాకుండా, అపుడు అమ్మఒడి అంటూ ఊదరగొట్టిన వైకాపా నేతలు.. ఇపుడు అమ్మకానికో బడి అంటూ జీవోలు జారీచేస్తూ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు.