Publish Date: Wed, 08 Sep 2021 (08:02 IST)
Updated Date: Wed, 08 Sep 2021 (08:06 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హస్తిన బాటపట్టారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్లో ఉండగా, రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.
కొత్త పీసీసీ చీఫ్ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీతో టి.కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇపుడు ఆసక్తిని రేపుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. మొదట ప్రహ్లాద్ జోషితో సమావేశంకానున్న ఆయన.. ఆ తర్వాత తన పర్యటనలో పలువురు బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది.
ఇదిలావుంటే, ఢిల్లీలో తెరాస భవన్ నిర్మాణ ప్రారంభోత్సవానికి ఈ నెల ఒకటో తేదీన వెళ్లిన సీఎం కేసీఆర్... వారం రోజులుగా అక్కడే మకాం వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరలను కలిశారు. వారం రోజుల తర్వాత బుధవారం హైదరాబాద్కు చేరుకోనున్నారు.