Publish Date: Wed, 17 Oct 2018 (10:04 IST)
Updated Date: Wed, 17 Oct 2018 (10:06 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ పార్టీ పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తన బలాన్నే నమ్ముకుని జనసేన పార్టీని పవన్ స్థాపించారు. ఈ పార్టీతో అటు అధికార టీడీపీ, ఇటు విపక్ష వైకాపాలు బెంబేలెత్తిపోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తాజాగా తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వంతెనపై కవాతు నిర్వహించారు. దీనికి వేలాది మంది జనసేన సైనికులు తరలివచ్చారు. ఇది విజయవంతం కావడంతో జనసేన శ్రేణులు మరింత ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన రాజమహేంద్రవరంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో పవన్ మాట్లాడుతూ, 'బలప్రదర్శన చేయాల్సి వస్తే.. శత్రువైనా మిగలాలి, నేనైనా మిగలాలి... కవాతు బల ప్రదర్శన కాదు.. ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి ప్రజలు చేసిన హెచ్చరిక.. దాదాపు పది లక్షల మంది ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు చేశారు' అని వ్యాఖ్యానించారు.
'వారు నన్ను చూడడానికి రాలేదు.. పలావు ప్యాకెట్కో, సారా ప్యాకెట్కో ఆశపడి రాలేదు.. దోపిడీ ప్రభుత్వాలకు హెచ్చరిక చేయడానికి వచ్చారు' అని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బాధ్యతగా వ్యవహరించాలని, అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఏదో చేస్తానంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.