ఆ నేతల చర్మం ఏనుగు చర్మంలా తయారైంది : పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు.. దాని మిత్రపక్షమైన బీజేపీలకు చెందిన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఘాటైన విమర్శలు గుప్పించారు.
Publish Date: Thu, 07 Dec 2017 (08:39 IST)
Updated Date: Thu, 07 Dec 2017 (08:50 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు.. దాని మిత్రపక్షమైన బీజేపీలకు చెందిన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఘాటైన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, బీజేపీ ఎంపీ కె.హరిబాబు, గోకరాజు గంగరాజు, టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, అశోక గజపతిరాజుల పేర్లను ప్రస్తావిస్తూ వారికి బహిరంగ హెచ్చరిక చేశారు.
జనసేన ఆధ్వర్వంలో ‘చలోరే...చలోరే చల్’ కార్యక్రమంలో భాగంగా విశాఖ పోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ఎంపీలకు ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. వారికి తాను పిడికెడు మట్టితో సమానమని, ఆ మట్టి ఏమి చేయగలదో చూపిస్తానని హెచ్చరించారు. నేటి నేతల చర్మం ఏనుగు చర్మంలా తయారైందని, అలాంటి వారికి ప్రజలు అంకుశమనే ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కొందరు మంత్రులు, ఎంపీలు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి నిస్సిగ్గుగా.. దర్జాగా తిరుగుతున్నారని, వారిని వదిలేసి పంట రుణం తీసుకొని కట్టడం లేదని పేద రైతులను వేధించడం ఏ విధంగా సమంజసమని పవన్ ప్రశ్నించారు. ఎవరినీ వెనకేసుకొచ్చే అవసరం తనకు లేదని, రక్త సంబంధీకులైనా బయటి వారైనా ఒకలాగే వ్యవహరిస్తానన్నారు. 2019లో ఎన్నికలు వస్తున్నాయని, నేతలంతా ఓట్ల కోసం అంతా రోడ్లపైకి వస్తారని, తప్పకుండా వారిని నిలదీస్తామని ప్రకటించారు.