Publish Date: Mon, 15 Apr 2019 (18:04 IST)
Updated Date: Mon, 15 Apr 2019 (18:11 IST)
ఈనెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. పోలింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగడం పట్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమీషన్ వైఫల్యంగా పేర్కొన్నారు. మరికొంత మంది మరో వాదనకు తెరలేపారు. ఈవీఎంలో గుర్తు తాము నొక్కినదానికే పడుతుందో లేదో అని సందేహం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో మరోసారి కలకలం రేగింది. అదేమిటంటే నెల్లూరు జిల్లాలో వీవీప్యాట్ స్లిప్పులు బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. ఆత్మకూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వందలకొద్దీ వీవీప్యాట్ స్లిప్పులు వెలుగుచూశాయి.
సుమారు 300లకు పైగా ఉన్న స్లిప్పులను ఆర్డీవో బృందం స్వాధీనం చేసుకుంది. వీవీప్యాట్ స్లిప్పులు ఎలా బయటపడ్డాయనే అంశంపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించారు. అయితే ఈ ఘటనతో రాజకీయ పార్టీలలో మళ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.