ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో పర్యటిస్తున్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక కర్మయోగిగా అభివర్ణించారు. ఆయనకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారన్నారు.
ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారు. దేశ జెండా ఎంత పౌరుషంగా ఉంటుందో.. అలాగే దేశ పటాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారు. కూటమి 15 ఏళ్లకు తక్కువకాకుండా బలంగా ఉండాలి. ఇబ్బందులు ఉన్నా.. ఏమున్నా తట్టుకుని నిలబడాలి. ఒక తరం కోసం ఆలోచించే నాయకులు సీఎం చంద్రబాబు. ప్రధాని, సీఎం నాయకత్వంలో అందరం సమష్టిగా పనిచేస్తాం. వచ్చే తరం ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తాం అని పవన్ అన్నారు.