Publish Date: Tue, 19 Oct 2021 (22:29 IST)
Updated Date: Tue, 19 Oct 2021 (22:31 IST)
ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై అధికార పార్టీ దాడులు చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆనవాయితీలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యానికి పాతరేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని లోకేష్ ఫైరయ్యారు. ఆయన పతనానికి ఆయనే ఒక్కో ఇటుక పేర్చుకుంటున్నారని మండిపడ్డారు.
తెలుగు దేశం కార్యకర్తల సహనాన్ని చేతకానితనం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు జగన్ అంటే ముఖ్యమంత్రి అని గౌరవం ఉండేదని, కానీ ఆయన వికృతి బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్ అని అంటున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు.
జగన్ను ఉరికించి కొట్టడానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం లేదని, తమ క్యాడర్కు తమ అధినేత కనుసైగ చేస్తే చాలని లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయాలను ధ్వంసం చేయడం టీడీపీ కార్యకర్తలకు నిమిషం పని అన్నారు.
ఫ్యాన్ రెక్కలు మడిచి పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని లోకేష్ గుర్తుచేశారు. జగన్ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తే దాడులకు పాల్పడటం ఏంటని లోకేష్ ప్రశ్నించారు. పరిపాలన చేయమని ప్రజలు అధికారం ఇస్తే పోలీసుల సాయంతో మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్నారని లోకేష్ విమర్శించారు.