Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తితిదే అన్నప్రసాద కేంద్రాలు వైకాపా ప్రభుత్వ అవినీతి కేంద్రాలుగా మారాయి : నారా లోకేశ్

nara lokesh
, బుధవారం, 6 డిశెంబరు 2023 (09:36 IST)
పరమ పవిత్రంగా భావించే తితిదే శ్రీవారి ప్రసాదం పంపిణీపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తితిదే అన్నప్రసాద కేంద్రాలు వైకాపా ప్రభుత్వ అవినీతి కేంద్రాలుగా మారిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇదే విషయంపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
తిరుమలలో శ్రీవారి అన్నదాన నిలయాన్ని మా తాతగారైన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏప్రిల్ 6, 1985న ప్రారంభించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా అందరి సహకారంతో అన్నదాన సత్రాలు విస్తృతంగా ఏర్పాటై ఇప్పటివరకూ కోట్లాది మందికి అన్నప్రసాదాన్ని అందించి ఆకలి తీర్చాయి. దాతల విరాళాలతో అప్రతిహతంగా సాగుతున్న అన్నప్రసాదశాలలు వైసీపీ సర్కారు వచ్చాక అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆ విషయాన్ని అన్నప్రసాద నాణ్యత స్పష్టం చేస్తోందని అన్నారు. 
 
దేశం నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు తిరుమల - తిరుపతిలో అన్నప్రసాదశాలలో ఆహారం అంటే... పరమపవిత్రంగా భావిస్తారని తెలిసి, ఇంత నాసిరకంగా పెడుతున్న టీటీడీ... భక్తులకు సమాధానం చెప్పాలి. నా కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఆ రోజు అన్నదానానికి రూ.30 లక్షలను విరాళంగా ఇస్తుంటాం. నాలాగే లక్షల మంది దాతలు ఇస్తున్న విరాళాలు ఏమవుతున్నాయి? అన్నప్రసాదం ఎందుకు ఇంత అధ్వానంగా తయారు చేశారు? అంటూ లోకేశ్ మండిపడ్డారు.
 
నాసిరకమైన అన్నప్రసాదాలు అందిస్తూ భక్తుల మనోభావాలు గాయపరుస్తూ, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అవినీతి గద్దలను ఈ వైసీపీ సర్కారు కాపాడవచ్చు కానీ, ఆ శ్రీవారు శిక్షించి తీరుతారు. తిరుమల - తిరుపతి పవిత్రతని అడుగడుగునా దెబ్బతీసిన వైసీపీ సర్కారు, దాని కనుసన్నల్లో నడిచే పాలకమండలి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 
 
టీటీడీలో అవినీతి, అవకతవకలపై మాట్లాడితే కేసులు పెడతామని పాలకులు బెదిరించడం చూస్తుంటే వారి హస్తం ఉందనే అనుమానించాల్సి వస్తోంది. చిన్నారిని చిరుతపులి చంపేస్తే... తల్లిదండ్రులపైకి వేలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ చిన్నారి కుటుంబానికి కోర్టు ఆదేశించినా పరిహారం ఇవ్వకపోవడం దారుణం. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం వచ్చే, టీటీడీ వద్ద 5 లక్షలు లేవా? అని నిలదీశారు. 
 
తిరుమల వెళ్లే ఆర్టీసీ చార్జీలు పెంచేశారు. క్యూలైన్లలో భక్తులకు టిఫిన్, పిల్లలకు పాలు ఇవ్వడం ఆపేశారు. లడ్డూ నాణ్యత తగ్గించి ధర పెంచేశారు. రూము రెంట్ వంద నుంచి వెయ్యి చేయడం వంటివన్నీ శ్రీవారికి భక్తులను దూరం చేసే కుట్రలు కావా? అని నారా లోకేశ్ నిప్పులు చెరిగారు.
 
కాగా, పరమ పవిత్రంగా భావించి, కళ్లకు అద్దుకుని, ఆ దేవదేవుడు అందించినదిగా తిరుమల శ్రీవారి భక్తులు భావించే అన్నప్రసాదం పరమ అధ్వానంగా తయారైందంటూ, తిరుమల వెంగమాంబ అన్నప్రసాదశాలలో తమకు నాసిరకమైన భోజనం పెట్టడంపై భక్తులు ఆందోళనకు దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై లోకేశ్ స్పందించారు. తిరుమల కొండపై జరుగుతున్న అవినీతికి ఇదే నిదర్శనం అని విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటన మంగళవారం విడుదల చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ కూర్పుపై రేవంత్ రెడ్డి చర్చ..