Publish Date: Sat, 25 May 2019 (13:24 IST)
Updated Date: Sat, 25 May 2019 (13:25 IST)
వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రోజా. గతంలో టిడిపి సీనియర్ నేత గాలిముద్దుక్రిష్ణమనాయుడుపై పోటీ చేసి గెలుపొందిన రోజా ఆ తర్వాత ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్పై కూడా పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు 2,078 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన విజయం ఖాయమని తెలిసినా రోజాలో ఒకింత భయం మొదట్లో కనిపించింది.
ముద్దుక్రిష్ణమనాయుడు మరణంతో ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉందని, కాబట్టి తన ప్రత్యర్థి గాలి భానుప్రకాష్ గెలుస్తాడేమోనని రోజా అనుకున్నాను. అయితే గాలి భానుప్రకాష్ గట్టి పోటీ ఇచ్చినా చివరకు విజయం మాత్రం రోజాను వరించింది. ఈ సారి మాత్రం రోజా ఎంతో సంతోషంగా కనిపించారు.
కౌంటింగ్ తర్వాత నేరుగా నగరికి వెళ్ళిన రోజా రెండురోజులుగా అక్కడే ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై నగరిని మరింత అభివృద్థి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తనపై కక్ష్య కట్టి నగరికి నిధులు చంద్రబాబు మంజూరు చేయలేదని చెబుతూ వచ్చారు రోజా.
కానీ ఇప్పుడు అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కావాల్సినంత నిధులు తెచ్చుకుని ఎలాగైనా నగరిని అభివృద్థి పథంలోకి తీసుకువచ్చి మంచి ఎమ్మెల్యేగా పేరు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నారు రోజా. చురుగ్గా నగరి నియోజకవర్గంలో పర్యటిస్తూ తన గెలుపుకు కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నారామె.