Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాప్‌లో ఆనందయ్య మందు.. ఎవరూ కృష్ణపట్నం రావొద్దు.. కలెక్టర్

యాప్‌లో ఆనందయ్య మందు.. ఎవరూ కృష్ణపట్నం రావొద్దు.. కలెక్టర్
, మంగళవారం, 1 జూన్ 2021 (16:24 IST)
సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు సంజీవనిగా కనిపించింది. కరోనా సోకి పరిస్థితి విషమంగా ఉన్న వాళ్లలో కొందరు ఆనందయ్య మందు కారణంగానే తాము బతికామని.. అప్పటి దాకా వెంటిలేటర్‌పై ఉన్న తాను ఆనందయ్య మందు తీసుకున్న కొంత సమయానికే హ్యాపీగా కూర్చుని భోజనం చేయగలుగుతున్నానని చెప్పారు.

ఇలా కెమెరాల సాక్షిగా కొందరు పంచుకున్న అనుభవాలు ఆనందయ్య మందుపై ఆశలు రేకెత్తించాయి. బతుకు జీవుడా’ అంటూ కృష్ణపట్నానికి కరోనా బాధితులు క్యూ కట్టారు. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు మీడియాలో ఆనందయ్య కరోనా మందుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 
 
ఈ నేపథ్యంలో కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, హైకోర్టు కూడా ఆనందయ్య మందును పంపిణీ చేయాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆనందయ్య పంపిణీ చేసే మందు కోసం ప్రజలు తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటం.. అలా రావడం వల్ల కోవిడ్-19 వ్యాప్తి మరింతగా పెరిగే ప్రమాదం ఉండటంతో మందు పంపిణీకి జిల్లా కలెక్టర్ చక్రధర్ ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించారు.
 
ఆనందయ్య పంపిణీ చేసే మందును మొబైల్ యాప్ ద్వారా బాధితులకు అందించాలని నిర్ణయించారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం ప్రత్యేకంగా యాప్ రూపకల్పన చేయాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ యాప్ ద్వారా మందును పంపిణీ చేస్తామని, ఎవరూ కృష్ణపట్నం రావొద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఆన్‌లైన్‌లో మందు పంపిణీ చేస్తామని.. అయితే అందుకు ఐదు రోజుల సమయం పడుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ చెప్పారు. ఇదిలా ఉండగా.. కరోనాకు విరుగుడుగా ఆనందయ్య తయారు చేసే మందు కోసం స్థలం సిద్ధమవుతోంది.
 
గతంలో మందు పంపిణీ చేసిన దగ్గరే మందును తయారుచేయనున్నట్లు తెలిసింది. సమీప ప్రాంత ప్రజలకు ఇకపై కూడా నేరుగానే మందు పంపిణీ చేసే అవకాశమున్నట్టు సమాచారం. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఆనందయ్య మందు కోసం పడిగాపులు కాయడం, వారు చుట్టు పక్కల గ్రామాల్లో తిరుగుతుండటం వల్ల కరోనా వ్యాప్తి పెరిగే అవకాశముందని.. అందుకే అలాంటి వారి కోసం ఆన్‌లైన్ ద్వారా మందు పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. మొబైల్ యాప్ రూపకల్పన పూర్తయిన తర్వాత అందులో వివరాలు ఎలా పొందుపరచాలో.. ఎంతమేర మందును వినియోగించాలో.. బాధితులు మందును ఎలా వాడాలో కూడా ఆ యాప్‌లో పొందుపరిచే అవకాశాలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరణంలోనూ జంటగా చనిపోయిన ఎస్వీ ప్రసాద్